
జెరూసలెం: ఆహారం, వైద్య సామగ్రి వంటి మానవతా సాయంతో గాజాకు వెళ్తున్న పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ బోటును ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) సీజ్ చేసింది. సోమవారం తెల్లవారుజామున గాజాకు 200 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో బోటును స్వాధీనం చేసుకుంది. అందులో గ్రెటా థన్బర్గ్ , పాలస్తీనియన్ సంతతికి చెందిన ఫ్రెంచ్ ఎంపీ రీమా హసన్ సహా12 మంది పర్యావరణ ఉద్యమ కార్యకర్తలు ఉన్నారు. తమను ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టాయని గ్రెటా థన్బర్గ్ వెల్లడించారు.
ఫ్రీడమ్ ఫ్లోటిల్లా మెంబర్స్ తో కలిసి గాజా వెళ్తుండగా తమను అడ్డుకుని బంధించారని ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం తమకు సాయం చేయాలని థన్బర్గ్ ముందుగా రికార్డ్ చేసిన ఓ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. కాగా, గ్రెటా థన్బర్గ్ తమ కార్యకర్తలతో గాజాకు బయల్దేరడం ఓ పబ్లిసిటీ స్టంట్ అని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ అభివర్ణించింది. అది మానవతా సాయం అందించడం కోసం వస్తోన్న నౌక కాదని, కేవలం సెలబ్రిటీల సెల్ఫీ యాత్ర అని ఆరోపించింది.
అందులో ఆహార పదార్థాలు కూడా చాలా తక్కువ ఉన్నాయని పేర్కొంది."సెలబ్రిటీల సెల్ఫీ యాట్ ఇజ్రాయెల్ తీరాలకు సురక్షితంగా చేరుకుంటోంది" అని ఎక్స్ లో పోస్ట్ చేసింది. గాజా నలువైపులా ఆంక్షలు ఉండటంతో వీరి బోటును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.12 మందికి ఇజ్రాయెల్ సైనిక సిబ్బంది శాండ్విచ్లు, నీళ్లు అందిస్తున్న వీడియోను విడుదల చేసింది. బోటు సోమవారం మధ్యాహ్నం ఇజ్రాయెల్కు బయలుదేరిందని.. అష్డోడ్ ఓడరేవుకు చేరుకుంటుందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నడవ్ షోషాని పేర్కొన్నారు.